Wednesday, 25 May 2022
వేద వ్యాసమహా ఋషి (Veda Vyasa Maha Rishi)
నేటి ఆధ్యాత్మిక గ్రంథాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ వ్యాసుడు రాసినవే. వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వేద వ్యాసుడయ్యాడు. గురు పూర్ణిమ రోజే వ్యాసుడు వేదాలను విభజించాడు. వేదాలతో పాటు మహాభారతం, మహాభాగవతంతో పాటు అష్టాదశపురాణాలను రచించాడు. వ్యాసుడు సప్తచిరంజీవులలో ఒకడు.
దాశరాజు కుమార్తె, మత్స్య కన్య సత్యవతి. సౌందర్య రాశి అయిన ఆమె దగ్గర భరించరాని చేపల వాసన వల్ల ఎవరూ ఇష్టపడేవారు కాదు. దీంతో తీవ్ర వేదనకు గురైన ఆమె అరణ్యంలో సంచరిస్తూ ఒక రోజు పరాశుర మహర్షి ఆశ్రమానికి చేరుకుంది. ఆమె అందాన్ని చూసి మోహపరవశుడైన పరాశురుడు తన కోరిక తీర్చమన్నాడు. అయితే తాపసులకు ఇది తగదని సత్యవతి వారించినా నిగ్రహించుకోలేపోయాడు. అంతేకాదు శరీరం అతిలోక పరిమళభరితమయ్యేలా, కన్యత్వాన్ని కూడా చెడిపోకుండా వరం ప్రసాదించాడు. అలా వారి సంగమ ఫలితంగా సద్యోగర్భాన జన్మించిన వాడే కృష్ణద్వైపాయుడుగా పిలువబడే వ్యాసుడు. పన్నెండేళ్ల పాటు ఆమె దగ్గర పెరిగిన వేద వ్యాసుడు తపస్సు చేసుకోడానికి బయలుదేరాడు. వెళ్లే ముందు కృష్ణజినదండ, కమండలం ధరించి "అమ్మా నా అవసరం వచ్చినప్పుడు నన్ను తలచుకుంటే తప్పక ఆక్షణమే నీ దగ్గరకు వచ్చి పని పూర్తి చేస్తానని తెలిపాడు. లోక కల్యాణం కోసం తపోవనంలో ఘోర తపస్సు చేసి బ్రహ్మ నుంచి వరాలు పొందాడు. వ్యాస భగవానుడని బాదరాయణుడని ప్రసిద్ధి చెందిన వ్యాస మహర్షి జన్మదినం ఆషాఢ శుద్ధ పౌర్ణమి . అష్టాదశ పురాణాలను, బ్రహ్మ సూత్రాలను రాసి భారతీయ సాహిత్యంలో హిమాలయాలంత ఎత్తుకు ఎదిగాడు .వేదాలను విభజన చేసి అందుబాటులోకి తెచ్చిన మహోన్నతుడు. యమునా నదీ తీరంలో జన్మించిన వ్యాసుడు మహాభారతం లాంటి అద్భుత కావ్యాన్ని అందించాడు. అందులో ముఖ్య పాత్ర దారి విష్ణుమూర్తి అవతారమే వ్యాసభగవానుడు. సత్యవతి కుమారుడు సేతి, మాది నదుల సంగమ స్థానంలో జన్మించాడని కూడా అంటారు .ఈ ప్రదేశానికి ఆయన పేరే పెట్టారు. ప్రస్తుతం నేపాల్లో తనాహు జిల్లాలోని తనౌళి పట్నంలో వ్యాసుడు జన్మించాడని కొందరు అంటారు. ప్రతి ద్వాపర యుగంలోనూ వ్యాసుడు జన్మించి వేద విభజన చేస్తాడని విష్ణు పురాణం చెబుతోంది. భారత రచనకు తన సహాయకారుడిగా గణపతిని పెట్టుకొన్నాడు. తన ఘంటానికి ఆపకుండా పని చెబితినే రాస్తానని గణపతి షరతుపెట్టి రాశాడు. భారతానికి జయ కావ్యమనే పేరుంది. ఇందులో విష్ణు సహస్రనామం, భగవద్గీత కూడా ఉన్నాయి. వ్యాసుడు చివరి రచనే మహా భారతం. భారతాన్ని ఉగ్ర సేన సౌతి మౌఖికంగా వ్యాపింప జేశాడు. నైమిశారణ్యం లో శౌనికాది మహర్షుల సమక్షంలో దీన్ని వినిపించాడు.
బౌద్ధ వాఙ్ఞయంలోనూ వ్యాసుడు ప్రస్తావన ఉంది. పాళీ భాషలో దీన్ని‘కన్హ దిపాయన’అన్నారు. సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథసాహెబ్లోనూ వ్యాసుడు బ్రహ్మ దేవుడి కుమారుడని పేర్కొన్నారు. వ్యాసభగవానుని గురు గోవిందసింగ్ వేద నిధి అన్నాడు. కౌటిల్యుడి అర్ధశాస్త్రంలోనూ వ్యాసుని విషయం తమాషాగా ఉంటుంది. దాండక్య అనే పేరున్న భోజుడనే రాజు ఒక బ్రాహ్మణ స్త్రీని బలాత్కరించబోతే వంశం పూర్తిగా నాశమై పోయాయి. వాతాపి అహంకారంతో అగస్త్యుని అవమానించి, ద్వైపాయనుడినిపై దాడిచేస్తే నశించి పోయారని చాణక్యుడు వివరించాడు. .
రేగుచెట్లు వనంలో జన్మించాడు కాబట్టి బాదరాయణుడు అయ్యాడనేది ఓ కథనం. ఈయనే బ్రహ్మ సూత్రాలు రాసి వేద వేదాంత విశేషాలను అందులో నిక్షిప్తం చేశాడు. బ్రహ్మ సూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులను ప్రస్తాన త్రయం అంటారు .ఈ మూడింటికీ కర్త వ్యాసుడే. పతంజలి యోగ శాస్త్రానికి ఆధారం వ్యాసమహర్షి చెప్పిన సూత్రాలే.
మహాభారతాన్ని రచించిన వ్యాసుడు భారతకథలో ఒకభాగమై ఉన్నాడు. అయినప్పటికీ వ్యాసుడు కర్తవ్యనిర్వహణ మాత్రమే చేస్తూ మిగిలిన వారికి కర్తవ్యబోధ చేస్తూ తిరిగి తనదారిన తాను వెళ్ళిపోతాడు.
కురువంశ రాజైన శంతనడు, గంగ కుమారుడు భీష్ముడు. శంతనుడు సత్యవతి మీద మోజు పడుతాడు. వ్యాసుడు తల్లి అనుమతితో తపోవనానికి వెళతాడు. ఆ తరువాత సత్యవతీ శంతనుల వివాహం జరిగింది.
సత్యవతీ శంతనుల వివాహకాలంలో, సత్యవతి తండ్రిఐన దాశరాజు రాజ్యాధికారాన్ని వదులుకోవాలని విధించిన షరతు కారణంగా భీష్ముడు ఆమరణాంతం బ్రహ్మచర్య వ్రతం అవలంబిస్తానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. శంతనుని మరణం తరువాత వారి కుమారులైన చిత్రాంగదుడు బలగర్వంతో గంధర్వుని చేతిలో మరణం చెందాడు. విచిత్రవీరుడు సుఖలాలసతో అకాలమరణం చెందాడు. భరతవంశం వారసులను కోల్పోయిన తరుణంలో సత్యవతి భరతవంశ పునరుద్ధరణ కొరకు తన పుత్రుడైన వ్యాసుని మనన మంత్రం చే తన వద్దకు రప్పించింది. భరతవంశాన్ని నిలపమని వ్యాసుని ఆదేశించింది. తల్లి ఆదేశాన్ననుసరించివ్యాసుడు అంబికకు దృతరాష్ట్రుని, అంబాలికకు పాండురాజుని, దాసికు విదురుని ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళతాడు.
ఆతరువాత వ్యాసుడు గాంధారి గర్భస్రావం సమయంలో ప్రవేశించి గాంధారి మృత పిండం నూట ఒక్క నేతికుండలలో పెట్టి వాటిని పరిరక్షించే విధానాన్ని చెప్పి తిరిగి తనదారిన తాను వెళతాడు.
దుర్యోధనుడు భీమునిపై మూడుమార్లు హత్యాప్రయత్నం జరిపిన పిమ్మట తన తల్లికి కురువంశంలో రానున్న పెను దుష్పరిణామాలు సూచించి వాటిని ఆమె తట్టుకోవడం కష్టమని తపోవనానికి వెళ్ళి ప్రశాంత జీవితం గడపమని సూచించి తిరిగి తనదారిన తాను వెళతాడు. తరువాత లక్క ఇంటి దహనం తరువాత హిడింబాసురుని మరనానంతరం హిడింబి భవిష్య సూచనపై శాలిహోత్రుడు నివసించిన ఆశ్రమప్రాంతంలో పాడవులు నివసించే సమయంలో వ్యాసుడు పాండవుల చెంతకు వచ్చి వారికి ఊరట కలిగించాడు. ఆ ఆశ్రమ మహత్యం చెప్పి అక్కడ సరస్సులో జలము త్రాగిన వారికి ఆకలి దప్పులు ఉండవని, అక్కడి వృక్షముకింద నివసించే వారికి శైత్య, వాత, వర్ష, ఆతప భయములుండవని సలహా అందించాడు. భీముని వివాహమాడ కోరిన హిడింబను కోడలిగా చేసుకోవడానికి సంశయిస్తున్న కుంతీదేవికి హిడింబ పతివ్రత అని ఆమెను కోడలిగా చేసుకోవడం శుభప్రధమని ఆమె సంతానం ద్వారా పాండవులకు సహాయమందగలరని సూచించి తనదారిని తాను వెళతాడు. ఆ తరువాతి కాలంలో ద్రౌపది స్వయంవరానికి ముందుగా పాందవులకు దర్శనమిచ్చి వారికి ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతం వివరించి స్వయంవరానికి వెళ్ళమని వారికి శుభంకలుగుతందని చెప్పి ద్రౌపది వివాహం తీరు ముందుగానే సూచించి అంతర్ధాన మయ్యాడు.
Subscribe to:
Post Comments (Atom)
-
Broadly speaking, welfare means efforts to provide a basic level of well- being through subsidized social services...
No comments:
Post a Comment